టీడీపీలో ఎమ్మెల్సీ ఫైట్ అదురుతోంది…!

ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం టీడీపీలో పోరు పీక్ స్టేజ్‌కి చేరింది. పార్టీలో బ‌లంగా ఉన్న నేత‌ల మ‌ధ్య భారీ స్థాయిలో ఫైట్ జ‌రుగుతోంది. ఇక‌, కుల స‌మీక‌ర‌ణ‌లు, సిఫార్సులు కామ‌న్‌! తాజా అంచ‌నాల ప్ర‌కారం టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి ఐదుగురు, గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు చేసేవారు ఇద్ద‌రు మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌నే టాక్ వ‌స్తోంది.

ఇదే ఖాయ‌మైతే.. ఒక ఎమ్మెల్సీ సీట‌ను లోకేష్‌కి రిజ‌ర్వ్ చేయాల్సిందే. మిగిలిన వాటికి పోటీ తీవ్రంగానే ఉండ‌నుంది. ముఖ్యంగా టీడీపీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నారు. అయితే, ఆయా స్థానాల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. తన సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర‌ణం బ‌ల‌రాంకి సీటు రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. అయితే, లోకేష్‌కి సీటిస్తే.. క‌ర‌ణానికి క‌ష్ట‌మ‌నే టాక్ వ‌స్తోంది. ఇక‌, రెడ్డి సామాజికవర్గం కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక్క‌డ వైకాపాకు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న నేప‌థ్యంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన స‌తీష్‌రెడ్డికి ఛాన్స్ ల‌భించ‌నుంది. దళితుల కోటాలో మాజీ మంత్రులు ప్రతిభా భారతి లేదా జె.ఆర్‌.పుష్పరాజ్‌, బీసీ కోటాలో కర్నూలు ఎంపిగా ఓడిపోయిన బీటీ నాయుడును, కాపు సామాజికవర్గ కోటాలో ఇంత వరకు ఎవరినీ ఎంపికచేయవేదని ప్రచారం జరుగుతోంది. అయితే, కేంద్ర మంత్రి సుజనాచౌదరికి సన్నిహితంగా ఉండే ‘చందు సాంబశివరావు’ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.ఈ క్ర‌మంలో చందుకి సుజ‌నా హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

గ‌తంలోనూ చందుకు చివ‌రి నిమిషంలో టికెట్ ర‌ద్ద‌యిపోయింది. అయితే, ఇప్ప‌టికైనా త‌న‌ను గుర్తించాల‌ని చందు కోరుతున్నారు. ఈయ‌న‌కు సుజ‌నా ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ డంతో పాటు కాపు సామాజిక వ‌ర్గానికి చెంది ఉండ‌డం క‌లిసొచ్చే అంశం. ఇలా మొత్తానికి టీడీపీలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి.