బాబు ప్ర‌భుత్వంపై పోరాటానికి ప‌వ‌న్ రెడీ

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు ప్ర‌శ్నించే టైం వ‌చ్చిందా? అది కూడా మిత్ర‌ప‌క్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబుపైనే ప‌వ‌న్ రెచ్చిపోతాడా?  బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న గోదావ‌రి మెగా ఫుడ్ పార్క్‌ని అక్క‌డి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను పొలాల‌కు పారే నీళ్ల‌లోకి వ‌దులుతార‌ని, ఫ‌లితంగా రాష్ట్రానికే ధాన్యాగారం వంటి ప‌శ్చిమ‌గోదావ‌రిలో వంద‌ల హెక్ట‌ర్ల‌లో పొలాలు నాశ‌నం అయిపోతాయ‌ని వారు ఆందోళ‌న చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన రైతులు.. త‌మ పొలాల‌ను కాపాడాల‌ని జ‌న‌సేనానిని అభ్య‌ర్థించారు. మెగా ఫుడ్ పార్క్‌ను అడ్డుకోవాల‌ని ఆయ‌న‌ను వారు కోరారు. మెగా ఫుడ్ పార్క్ వ‌ల్ల క‌లిగే భారీ న‌ష్టాన్ని వారు ప‌వ‌న్‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో అమ‌రావ‌తిలో రైతులు నష్ట‌పోతున్నార‌ని తెలిసి వారిని క‌లిసేందుకు ప‌వ‌న్ స్వ‌యంగా వెళ్లిన విష‌యాన్ని వారు గుర్తు చేశారు. అదేవిధంగా త‌మ స‌మ‌స్య‌పైగా ప‌వ‌న్ గ‌ళం విప్పాల‌ని, ప్ర‌భుత్వంతో చ‌ర్చించి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. రైతులతో సుదీర్ఘంగా భేటీ అయిన ప‌వ‌న్‌.. వారు చెప్పిన‌వ‌న్నీ విన్నాక‌.. త‌న మ‌న‌సులో మాట‌ను కూడా బ‌య‌ట పెట్టారు.

ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించ‌కుండానే… ఘాటు హెచ్చ‌రిక‌లే చేశారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో.. ప్రజల సమస్యలు కూడా అంతే ముఖ్యమని  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా… అభివృద్ధితో ప్రజల జీవితాలు బాగుపడాలే కానీ.. వారు భయంతో బతకకూడ‌ద‌ని కూడా అన్నారు.  .జనసేన పార్టీకి అభివృద్ధి తో పాటు ప్రజల సమస్యలు కూడా అవసరమే అని అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను స్వ‌యంగా ప‌శ్చిమ‌గోదావ‌రి వ‌చ్చి ప‌రిస్థితిని ప‌రిశీలించాల‌న్న రైతుల అభ్య‌ర్థ‌నకు కూడా సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లోనే అక్క‌డికి వ‌చ్చి ప‌రిశీలించి, ప్ర‌భుత్వంతో మాట్లాడ‌తాన‌న్నారు.

దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టే చెప్పాలి. గ‌తంలోనూ అమ‌రావ‌తి భూముల విష‌యంలో రైతుల ప‌క్షాన నిలిచిన ప‌వ‌న్ వారిపై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోకుండా అడ్డుకోగ‌లిగారు. ఇప్పుడు కూడా ఇదే పంథా అనుస‌రిస్తారా?  అన్న‌ది వేచి చూడాలి. కాగా, ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో చంద్ర‌బాబును ప‌వ‌న్ ఇప్ప‌టికే త‌ప్పుప‌ట్టారు. పాచి పోయిన ల‌డ్డూలు ఎవ‌రైనా తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. మ‌రి ఆక్వా ఫుడ్ విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.