నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రానికి పది కాదు, ఇరవై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది సింగర్స్ పని చేశారట. అవును, మీరు విన్నది నిజమే. ఈ మధ్య ఒక్కో పాటను ఒక్కొక్కరితో పాడిస్తున్నారు గనుక సినిమాలో ఐదు పాటలుంటే పది మంది పాడేసి వెళ్లిపోతున్నారు. ఒకవేళ కోరస్ సింగర్స్ ఉంటే ఆ సంఖ్య ఇరవై లేదా ముప్పైకి చేరుతుంది. కానీ, అఖండకు మాత్రం 120 మంది గాయనీ గాయకులు పని చేశారట.
ఈ విషయాన్ని తమన్ స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇటీవలే విడుదలై సూపర్ రెస్పాన్స్ను దక్కించుకున్న అఖండ టైటిల్ సాంగ్ కోసం పదుల సంఖ్యలో సింగర్స్ పని చేశారని చెప్పుకొచ్చిన తమన్.. మిగతా పాటలకు కూడా కోరస్ సింగర్స్ చాలా మంది అవసరం పడ్డారని వివరించాడు.
అలాగే సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్దరు ముగ్గురు ప్రముఖ గాయనీ గాయకులు పని చేశారని.. అలా మొత్తం సింగర్స్ సంఖ్య 120కి చేరిందని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతే కాదు, ఈ సినిమాకు ఐదు వందలమంది మ్యుజిషీయన్స్ పనిచేశారని, పాటల విషయంలో ఎక్కడా రాజీ పడలేదనీ తమన్ చెప్పుకొచ్చారు. ఇక ఈయన వ్యాఖ్యాలతో అఖండ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.