మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం.
అయితే ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. `కరోనా సమయంలో విందులు, వినోదాలు, సన్మానాల పేర్లతో కళాకారులందర్నీ ఒకచోటకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలాడొద్దు. ఓట్లు కావాలంటే ఫోన్ చేసి మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి.` అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బండ్ల వ్యాఖ్యలతో.. ఆయనపై రివర్స్ ఎటాక్ మొదలైంది.
బండ్ల వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చారు. అసోసియేషన్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడం జరుగుతాయి. కానీ, బండ్ల గణేశ్ వ్యాఖ్యలను తాను నిజంగానే షాకయ్యానని తెలిపాడు. గుజరాత్తో పాటు మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి అందరు వెళ్తున్నారు.. మరి దాని గురించి బండ్ల గణేశ్ ఏం మాట్లాడుతారు? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.
మరోవైపు జీవితరాజశేఖర్ కూడా బండ్లపై కౌంటర్ ఎటాక్ కి దిగారు. ఆమె మాట్లాడుతూ..`రూల్స్ పాటిస్తూ ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడేమీ వేలకొలది జనాలొచ్చేయలేదు. తొక్కిసలాట జరగలేదు. ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని తీసుకుంటూనే ఉన్నాం. అయినా గణేష్ గారు ఇరవై నాలుగు గంటలు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది` అంటూ పేర్కొన్నారు.