తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ వరుస విషాదాలను సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకున్న కరోనా.. తాజాగా ప్రముఖ గాయకుడిని బలితీసుకుంది.సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.
ఇటీవల ఆనంద్కు కరోనా సోకగా.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తాజాగా తుదిశ్వాస విడిచారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది.
ఇక ఆనంద్ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన గాత్రంతో 70లలో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆనంద్..ఘంటసాల మరణం తర్వాత పలువురు హీరోలకు గాత్రాన్ని అందించారు. అలాగే స్వరమాధురి పేరుతో ఓ సంస్థను స్థాపించిన ఆనంద్ వేలాది కచేరీలు నిర్వహించారు.