`ఆహా` స‌క్సెస్‌తో నాగార్జున కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే..?

క‌రోనా దెబ్బ‌కు థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో.. ఓటీటీల‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాల‌న్నీ ఓటీటీలోనే విడుద‌ల అవ్వ‌డంతో.. అంద‌రూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచ‌ర్ అని భావించిన ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థ‌ను స్టార్ట్ చేశారు.

ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇక ఆహా స‌క్సెస్ అవ్వ‌డంతో కింగ్ నాగార్జున కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. తాను కూడా సొంతంగా ఓటీటీని స్టార్ట్ చేయాల‌ని నాగ్ భావిస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సినిమాలు చేస్తూనే, సీరియల్స్ కి కూడ తెరతీశారు. ఈ బ్యానర్ పై భారీస్థాయిలో ధారావాహికలు ప్రేక్షకులను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాగ్ సొంత ఓటీటీని కూడా ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. అయితే ఒక్క‌రే కాకుండా కొందరు భాగస్వాములను కలుపుకుని త్వ‌రోల‌నే ఓటీటీని స్టార్ట్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.