ప్రస్తతం దేశంలో కరోనా వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వేలల్లో నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది.
అయితే ప్రజల్లో పలు అపోహలు ఉండడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సంస్థ వినూత్న ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తాం అంటూ `హలో కిచెన్` అనే సంస్థ ఆఫర్ పెట్టింది.
ఆ సంస్థకు చెందిన విజయనగరం, కాకినాడ బ్రాంచీలో ఈ బంపర్ అందుబాటులో ఉంది. ఫ్రీ బిర్యానీ కావాలనుకుంటే వ్యాక్సిన్ వేయించుకున్నట్టు రశీదు చూపాలి. టీకా ఉత్సవంలో భాగంగా నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆ ఆఫర్ ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తొలి వంద మందికి మాత్రమే ఫ్రీ బిర్యానీ అందిస్తారు.