వేసవి కాలం మొదలైంది. రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండలు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వచ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండల దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
అయితే తాజా సమాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాడ్పులు వీస్తాయని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. అందువల్ల, ప్రజలు రాబోయే మూడు రోజులు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణం శాఖ హెచ్చరించింది.