దిల్ రాజు అల్లుడి ల‌గ‌ర్జీ కారు చోరీ చేసిన అకాశ్ అంబానీ మేనేజర్.. అస‌లేం జ‌రిగిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ అయింది. ఆకాశ్ అంబానీ మేనేజర్ అతని కారును కొట్టేశాడు. ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు, హన్షితా రెడ్డి భ‌ర్త‌ అర్చిత్ రెడ్డి రూ. 1.7 కోట్లు విలువైన పోర్షే కారు దొంగ‌త‌నానికి గురైంది. శుక్రవారం ఉదయం అర్చిత్ రెడ్డి త‌న కారులో హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌కు వెళ్లారు.

కారును బయటే పార్క్ చేసి.. ముప్పై నిమిషాల తర్వాత వ‌చ్చి చూడ‌గా కారు కనిపించలేదు. దాంతో అర్చిత్ రెడ్డి వెంట‌నే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంట‌నే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించ‌గా.. పోర్షే కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తించారు.

ఆపై కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్ర‌మ‌త్తం చేయ‌గా.. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ అయిన కారును గంట‌లోనే పోలీసులు ప‌ట్టుకోవ‌డం ఓ ఎత్తు అయితే.. దొంగలించినోడి బిల్డప్ మ‌రొక ఎత్తు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతని చెప్పే మాటలకు పోలీసుల‌కే మ‌తిపోయింది. కారును తీసుకురావాలని మంత్రి కేటీఆర్ చెప్పాడని ఒకసారి.. తాను అకాశ్ అంబానీ మేనేజర్ ను అని మ‌రొక‌సారి.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సహాయకుడిన‌ని ఇంకొక‌సారి చెబుతూ పోలీసులకు కాసేపు పిచ్చెక్కించాడు. దీంతో నిందితుడి గురించి పోలీలుసులు ఆరా తీయ‌గా.. అత‌ను మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌.. గ‌త కొంత కాలం నుంచి అతని మానసిక స్థితి సరిగా లేదని తేలింది.