లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న రేణు దేశాయ్.. నిరాశలో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు అయ్యాయి. దాంతో పిల్లలను తీసుకొని ముంబైలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఒక కీలక పాత్ర ద్వారా మన ముందుకు రాబోతోంది.

ఈనెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది రేణు దేశాయ్. ఈ క్రమంలోనే గతంలో తాను మిస్ చేసుకున్న ఒక లక్కీ ఛాన్స్ గురించి చెప్పి అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ కి బద్రి సినిమా తర్వాత అవకాశాలు చాలా వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత నటించకూడదు అని నిర్ణయం తీసుకుందట. అలా నిర్ణయం తీసుకున్న సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని కూడా వదులుకుంది.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన మురారి ఎంత క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన కెరియర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా మురారి చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రేణు దేశాయ్ ని కృష్ణవంశీ అనుకున్నారు. అయితే మనసులో చేయాలని ఉన్నా కూడా సినిమాలు చేయను అని నిర్ణయం తీసుకుంది కాబట్టి నో చెప్పి పంపేసింది. దీంతో సోనాలి బింద్రే ను ఈ సినిమా కోసం తీసుకున్నారు.