విశాల్ గొప్ప మ‌న‌సు.. షూటింగ్ కోసం వెళ్లి ఆ గ్రామ‌స్థుల మ‌న‌సు దోచుకున్న హీరో.. ఏం చేశాడో తెలుసా?

కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్ రీసెంట్ గా `మార్క్‌ ఆంటోనీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న విశాల్‌.. మార్క్ ఆంటోనీతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.

ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ త‌న 34వ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం తూత్తుకుడి జిల్లాలోని వీరకాంచీపురం, ఊశిమేసియాపురం, కుమారచక్కణపురం గ్రామాల్లో ఈ సినిమా క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

అయితే తాజాగా విశాల్ షూటింగ్ కోసం వెళ్లి కుమారచక్కణపురం గ్రామ‌స్థుల మ‌న‌సు దోచుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఆయ‌న‌.. మ‌రోసారి త‌మ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. అస‌లేం జ‌రిగిందంటే.. కుమారచక్కణపురం గ్రామ ప్ర‌జ‌లు గ‌త కొన్నేళ్ల నుంచి నీటి సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యం కాస్త హీరో విశాల్ దృష్టి రావ‌డంతో.. వెంట‌నే తన సొంత డ‌బ్బుతో బోరు బావి వేయించారు. అలాగే ఐదు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సింథటిక్ వాటర్ ట్యాంక్ ని ఏర్పాటుచేయించి.. గ్రామస్థులు నీటిని ఉపయోగించుకునేలా కుళాయిలు కూడా ఏర్పాటు చేశాడు. కుమారచక్కణపురం గ్రామ ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చాడు. ఈ విషయం బ‌య‌ట‌కు రావ‌డంతో.. నెటిజ‌న్లు విశాల్ ను పొగుడుస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.