తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత నాలుగు సీజన్లకు హోస్ట్ అయిన నాగార్జునే.. ఈ సీజన్ కు కూడా రన్ అవుతున్నారు. సెప్టెంబర్ 3న సీజన్ 7 ప్రారంభం కాగా.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. తాజాగా ఫస్ట్ వీక్ పూర్తి అయింది. మొదటి వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.
రతిక రోజ్, షకీల, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ ధామిని, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉండగా.. కిరణ్ రాథోడ్ చివరకు ఇంటి బాట పట్టింది. అయితే ఇదే తరుణంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. కొందరు నెటిజన్లు బిగ్ బాస్ షోలో మహిళలకు దారుణమైన అన్యాయం జరుగుతుందని నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. బిగ్ బాస్ ఆరు సీజన్స్ లో ఒక్క లేడీ కంటెస్టెంట్ కు కూడా టైటిల్ దక్కలేదు.
పైగా మొదటివారమే ఇంటిదారి పట్టిన వాళ్లలో దాదాపు అందరూ అమ్మాయిలే. ఒక్క సీజన్4 మినహాయిస్తే.. ఆరు సీజన్స్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే. ఓటింగ్ అంటారు కానీ.. బిగ్ బాస్ మేకర్సే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అన్నది డిసైడ్ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ప్రతిసారి ఫస్ట్ వీక్ మహిళలనే ఎలిమినేట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ 1లో నటి జ్యోతి, సీజన్ 2లో సంజన, సీజన్ 3లో నటి హేమ, సీజన్ 5లో యూట్యూబర్ సరయు, సీజన్ 6లో అభినయశ్రీ, సీజన్ 7లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ చేశారు. దీంతో తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు అని.. మహిళలకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.