సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతూనే.. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూన్నారు. అందులో మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ ఒకటి. ఈ నేపథ్యంలోనే బిగ్సీ 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్ అయిన మహేష్ బాబు సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కాసేపు మీడియా వారితో ముచ్చటించాడు.
వారు అడిగిన అన్ని ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. `మీరు రోజులో ఎంత సమయం పాటు స్మార్ట్ ఫోన్ వాడతారు..?` అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. అందుకే మహేష్ ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. `మంచి క్వశ్చన్ అడిగారు. మీ అందరిలాగే నేను కూడా గంటలు తరబడి ఫోన్ ను యూజ్ చేస్తాను.
ఒక్కోసారి తలనొప్పి కూడా వచ్చేస్తుంది. అప్పుడే ఫోన్ ను పక్కన పెడతాను` అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. మరొక రిపోర్టర్ మీ ఫోన్ రింగ్ టోన్ ఏంటి..? అని ప్రశ్నించగా.. సైలెంట్ అంటూ మహేష్ సమాధానం ఇచ్చాడు. తన ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లోనే ఉంటుందని.. కాబట్టి రింగ్ టోన్ ఏంటో కూడా గుర్తు లేదని మహేష్ తెలిపాడు. ఇక తన తాజా చిత్రం గుంటూరు కారం గురించి మహేష్ మాట్లాడాడు. ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెగేసి చెప్పారు.