గుంటూరు కారంలో ఆ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా వెల్లడించిన నటి..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులైనప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా తీసుకోగా, పూజ హెగ్డే సినిమా నుండి తప్పుకుంది.

పూజ సినిమా నుండి తప్పుకోవడానికి సరైన కారణం బయటికి రాకపోయినప్పటికీ, తనకి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో సినిమా నుంచి తప్పుకుందని సమాచారం తెలుస్తుంది. ఇక పూజ ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకొని ఇటీవల షూట్ ని మొదలుపెట్టినట్టు సమాచారం. పూజా హెగ్డే ప్లేస్ లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి తానే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించి అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అమ్మడు హిట్, కిలాడీ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం విజయ్ ఆంటోని నటిస్తున్న ‘హత్య’ సినిమాలో నటిస్తుంది మీనాక్షి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ ఈవెంట్లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను. ఇప్పటికి నా కోరిక నెరవేరింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. మొదటి రోజు మొదటి షాట్ లో మహేష్ బాబు తో నటించిన సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్టార్ హీరో మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపింది. దాంతో గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నట్లు అర్థమవుతుంది.