వలసలని అధికంగా ప్రోత్సహించడం కూడా అనర్ధమే అని తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని చూస్తే అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన…ప్రతిపక్షాలు ఉండకూడదనే కాన్సెప్ట్ లో కాంగ్రెస్, టిడిపిలోని ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. ఇలా లాగడం వల్ల బిఆర్ఎస్కు ఒరిగింది ఏమి లేదు. అదనంగా ఆధిపత్య పోరు వచ్చింది.
అసలు బిఆర్ఎస్ లో ఆధిపత్య పోరుకు వలస నేతలే కారణం అవుతున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీటు దక్కదనే భావించే నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చాలా ఏళ్లు టిడిపిలో పనిచేసిన ఈయన…హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు. 2009లో మహేశ్వరంలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టిడిపి నుంచి గెలిచారు. తర్వాత బిఆర్ఎస్ లోకి జంప్ చేశారు.
ఇక 2018లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని బిఆర్ఎస్ లోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తీగలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక సీటు కూడా లేదు. దీంతో ఎప్పటినుంచో బిఆర్ఎస్ కు దూరం జరగాలని చూస్తున్న తీగల..తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న అనితా రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది. తీగల కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేస్తే మహేశ్వరంలో సబితాకు గట్టి పోటీ ఎదురవుతుంది.