పేరు రాబిన్ శర్మది… పెత్తనం మాత్రం ఆ నేతదే…!

తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా రాబిన్ శర్మ టీమ్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుందట. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తూ… పార్టీకి ప్రజల్లో మరింత గుర్తింపు వచ్చేలా కూడా రాబిన్ శర్మ టీమ్ కృషి చేస్తోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు రాబిన్ శర్మ టీమ్ రూపొందించినవే. అలాగే ఏ ఊరిలో సభ నిర్వహించాలి… ఏ ఊరిలో ర్యాలీ నిర్వహించాలి అనే విషయంపై నిర్ణయం కూడా రాబిన్ శర్మ టీమ్‌దే ఫైనల్ నిర్ణయం.

ఇంత కీలకమైన రాబిన్ శర్మ టీమ్‌ను కూడా పార్టీలోని వ్యక్తి తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ తరఫున సర్వే నిర్వహించే యువతి యువకులు ఎవరూ అనేది దాదాపు చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అయితే ఐ టీడీపీ తరఫున పని చేసే సభ్యులు మాత్రం పార్టీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కానీ రాబిన్ శర్మ టీమ్ ఎవరూ అనేది చాలా తక్కువ మందికే తెలుస్తోంది. వీరంతా ప్రజల్లో తిరుగుతూ… పార్టీ పై ప్రజల్లో అభిప్రాయాలు సేకరించి… ఓ నివేదిక రూపొందిస్తారు. దీని వల్ల సదరు నేత పని తీరు ఎలా ఉంది… అనే విషయంపై ఓ అవగాహనకు వస్తారు. అయితే ప్రస్తుతం రాబిన్ శర్మ టీమ్ తరఫున తిరిగే వారిలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎక్కువ మంది గోపాలపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ వెంకటరాజు మనుషులే ఎక్కువగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. గతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పదవిలో ఉన్న మద్దిపాటి వెంకటరాజు… అక్కడి పరిచయాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో తన వారినే ఎక్కువగా రాబిన్ శర్మ టీమ్ ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ద్వారా తనకు అనుకూలమైన వారికి అనుకూలంగా రిపోర్టు పార్టీ అధినేతకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తప్పుడు నివేదికలు ఇస్తే… పార్టీకి చెడ్డపేరు వస్తుందని పార్టీ నేతలు ఇప్పటికే అధినేతకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.