ఆది పురుష్ మూవీ వారికి ఫ్రీ అంటున్న మంచు మనోజ్ జంట..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మేనియా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది సినీ ప్రముఖులు నిరుపేదలకు అనాధలకు ఉచితంగా ఈ సినిమాని చూపించాలని అనుకుంటున్నారు.

అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా సినిమా టికెట్లను కొనుగోలు చేసి మరీ ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10,000 టికెట్లను పేదల కోసం తీసుకోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 10,000 టికెట్లను పేదల కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపింది.

ఇప్పుడు మంచు మనోజ్ దంపతులు కూడా ఆది పురుష్ సినిమాను వారికి ఫ్రీగా చూపిస్తామని ప్రకటించారు.తెలుగు రాష్ట్రాలలోని పలు అనాధ శరణాలయాల్లో ఉన్న 2500 మంది పిల్లలకు ఈ సినిమాను ఉచితంగా చూపించేందుకు మనోజ్ ,మౌనిక దంపతులు ముందుకు వచ్చారు. ఇందుకోసం రెండు ప్రైవేటు సంస్థలతో వీరు చేతులు కలపగా ఈ విషయాన్ని మంచి మనోజ్ సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి హద్దులు లేకుండా ప్రతి ఒక్కరు ఒక వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావిస్తూ జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమాను తెలుగు రాష్ట్రాలలో పలు అనాధ శరణాలయంలో ఉన్న 2500 మంది పిల్లలకు ఉచితంగా ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాము. ఈ గొప్ప కార్యక్రమం కోసం బృహస్పతి టేక్ నమస్తే వరల్డ్ సంస్థలతో మేము చేతులు కలుపుతున్నాము అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.