విలక్షణ నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు.. గత కొంత కాలం నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. వయసు పై బడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి ప్రస్తావిస్తూ కోటా షాకింగ్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు వీళ్ళెవరూ తాము ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెప్పుకోలేదు. కానీ ఈమధ్య కొంతమంది రోజుకి రూ. 2 కోట్లు తీసుకుంటున్నాను, రూ. 3 కోట్లు తీసుకుంటున్నాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు` అంటూ కోటా తెలిపారు.
అలాగే వాణిజ్య ప్రకటనల గురించి కోటా మాట్లాడుతూ.. హీరోలు బాత్ రూమ్ బ్రష్ ల దగ్గర నుంచి బంగారం వరకు ఏవీ వదలడం లేదు. అన్ని ప్రకటనలు చేసేస్తున్నారు. హీరోలు ఆ స్థాయిలో సంపాదిస్తుంటే మిగిలిన నటులకు సంపాదన ఎలా ఉంటుంది అని కోట ప్రశ్నించారు. ఇక కోటా కామెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయి. ఎందుకంటే, ఇటీవల ఓ సభలో పవన్ కళ్యాణే తాను రోజుకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాను అని బహిరంగంగా వెల్లడించారు. ఇప్పుడు కోటా పవన్ ను ఉద్దేశించే పరోక్షంగా సెటైర్ వేయడంతో..ఆయన ఫ్యాన్స్ కోటాపై మండిపడుతున్నారు.