సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్.. ఇప్పటికీ అడపా తడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. కానీ, ఆమె చెల్లెలు మోనాల్ నావల్ మాత్రం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 21 ఏళ్లకే తనువు చాలించింది. అక్క నట వారసత్వం తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చింది.
కన్నడ మూవీ `ఇంద్రధనుష్`తో మోనాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీతో పాటుగా, పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ `బద్రి`లో చిన్న పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో `ఇష్టం` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఊపందుకుంటుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా మోనాల్ 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయింది.
అప్పటికి మోనాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఈ సంఘటన సిమ్రాన్ తో సహా కుటుంబసభ్యులను, సినీ ప్రముఖులను తీవ్ర వేదనకు గురి చేసింది. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న మోనాల్ అంత చిన్న వయసులోనే సూసైడ్ చేసుకోవడానికి కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని అప్పట్లో సిమ్రాన్ ఆవేదన చెందారు. ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరై.. అవసరం తీరగానే బ్రేకప్ చెప్పి సదరు కొరియోగ్రాఫర్ మోనాల్ ను దారుణంగా మోసం చేశాడట. ఆ బాధ తట్టుకోలేక మోనాల్ చనిపోయిందని ప్రచారం జరిగింది. ఇకపోతే మోనాల్ వర్ధంతి రోజు సందర్భంగా సిమ్రాన్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా అందమైన సోదరి మోనాల్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను’ అంటూ చెల్లితో దిగిన కొన్ని ఫోటోలను పంచుకుంది. దీంతో మోనాల్ మ్యాటర్ మరోసారి వార్తల్లో నిలిచింది.
https://twitter.com/SimranbaggaOffc/status/1646858361223401472?s=20