ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో `బలగం` ఒకటి. ప్రముఖ కమెడిన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు.
చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ప్రియదర్శి కాదట. మరి ఇంతకీ బలగం వంటి సూపర్ హిట్ ను మిస్ చేసుకున్న ఆ దురదృష్టవంతుడు మరెవరో కాదు.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేశాడు. వేణు ముందుగా బలగం కథని శివ శంకర్ అనే నిర్మాతకి వినిపించగా.. ఆయనకు బాగా నచ్చిందట. అయితే అందులో తాను హీరోగా నటిస్తానని చెబితే.. అందుకే ఆయన ఒప్పుకోలేదట. దాంతో వేణు కొద్ది రోజుల తర్వాత దిల్ రాజుకి కథ వినిపించాడట. కథ విన్న వెంటనే హీరోగా ప్రియ దర్శి పేరు సూచించాడట దిల్ రాజు. ఆయన దర్శి పేరు చెప్పగానే, బలగం కథకి తనకంటే కూడా నూటికి నూరుపాళ్లు న్యాయం ప్రియ దర్శినే చెయ్యగలడు అని వేణుకి అనిపించిందట. దాంతో హీరోగా చేయాలన్న తన కోరికను పక్కన పెట్టి.. దర్శకత్వంపై పూర్తి ఫోకస్ ను పెట్టాడు. కట్ చేస్తే బలగం సూపర్ హిట్ అయింది. వేణు పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది.