సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ మీనా.. ఇప్పటికీ నటిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత ఏడాది ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను మీనా 2009లో పెళ్లి చేసుకుంది. వీరికి నైనాక అనే కూతురు ఉంది.
అయితే చిన్న వయసులోనే విద్యాసాగర్ పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో మీనాకు కోలుకోని దెబ్బ తగిలింది. కానీ, కూతురు భవిష్యత్తు కోసం భర్త మరణం త్వరగా తేరుకుని మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మీనా రెండో పెళ్లికి సిద్ధం అయ్యారంటూ గత కొద్ది రోజుల నుంచి పలు మార్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం పట్ల మీనా కూతురు ఓపెన్ అయింది. పరోక్షంగా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
మీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తైన సందర్భంగా.. గత నెలలో చెన్నైలో ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభుదేవా, రాధికా లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో నైనికా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. `అమ్మా నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి వచ్చావు. ఇప్పటికీ నటిగా కష్టపడుతూనే ఉంటావు. కానీ ఆ కష్టాన్ని ఇంట్లో ఎప్పుడూ చూపించలేదు.
నన్ను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. నాన్న మరణించాక అంతా చీకటిగా మారింది. నువ్వు డిప్రెషన్ కు గురయ్యావు. మానసికంగా కృంగిపోయావు. ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక కొన్ని మీడియా సంస్థలు నీ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దయచేసి అలా చేయొద్దు. ఆ అమ్మ కూడా మనిషే. ఆమెకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి` అంటూ నైనిక మాట్లాడింది. ఈ చిన్నారి మాటలకు రజనీకాంత్ సైతం ఎమోషనల్ అయ్యారు.