కొత్త సినిమాలు ప్రకటించని కీర్తి సురేష్.. కెరీర్‌ ఎలా ఉందో

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సాధించిన కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ సినిమా విజయోత్సాహంలో ఉంది. దసరా సినిమా విజయోత్సవ వేడుకల్లో ఆమె బిజీగా మారిపోయింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటించింది. సినిమా విజయం సాధించిన ఉత్సాహంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గంతులేస్తున్న వీడియోను కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. దీనికి “మీ ప్రేమను స్వీకరించిన తర్వాత వెన్నెల ఉత్సాహంతో దూకుతోంది.” అనే క్యాప్షన్ ఇచ్చింది. దీనికి హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, కళ్యాణి ప్రియదర్శన్, చాందిని తమిళరసన్, డైరెక్టర్ నందినీ రెడ్డి స్పందించారు. ఇదెలా ఉన్నప్పటికీ ప్రస్తుతం కీర్తిసురేష్ ఎలాంటి కొత్త సినిమాలు ప్రకటించలేదు. దసరా తర్వాత వరుస సినిమాలు చేస్తానని ఇటీవల ఆమె చెప్పింది. అయినప్పటికీ ఆమె నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

“మహానటి” సినిమా తర్వాత ఆ స్థాయిలో కీర్తి సురేష్‌కు విజయం దక్కలేదు. ఏ సినిమాలోనూ ఆమె స్కిన్ షో కు దూరంగా ఉంటోంది. నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే ఆమె దృష్టి సారించింది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి మంచి నటన కనబర్చింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఫలితంగా సినిమా క్రెడిట్ నానికి దక్కిందని చర్చించుకుంటున్నారు.


ఇటువంటి కారణాలు ఆమెకు సినిమా అవకాశాలు రావడం తగ్గిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరోయిన్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. కేవలం తెలుగుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె ఎంపిక చేసుకుంటున్న సినిమాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తమిళంలోనైనా కొత్త సినిమా ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.