హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ను పలువురు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. అందుకు కారణం ఆమె యానిమల్ లవర్ కావడమే.
రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మీ వంటి యానిమల్ లవర్స్ వీధి కుక్కలను అదుపు చేయనీయకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. దాంతో సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటూ రష్మీపై మండిపడుతున్నారు. కొద్ది రోజుల నుంచి రష్మీ గౌతమ్ మీద సోషల్ మీడియా సమరం కొనసాగుతూనే ఉంది.
మొన్నటికి మొన్న ఓ వ్యక్తి `నీకు చేతబడి చేయిస్తా, బయట తిరిగితే యాసిడ్ పోస్తా` అంటూ రష్మీని బెదిరించాడు. తాజాగా మరో నెటిజన్ రష్మీని అరెస్ట్ చేసి జైల్ లో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. వీధి కుక్కలకు ఆహారం పెడుతూ రష్మీ వాటిని ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా ముందు రష్మీని జైల్లో పెట్టాలని ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కి స్పందించిన రష్మీ.. అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. `అది మీ వల్ల కాదు. ఏం కావాలంటే అది చేసుకో` అంటూ రిప్లై ఇచ్చింది.