ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
అయితే విడుదలకు ముందు వారసుడు టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా వారసుడు చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) మరణించారు. దీంతో `వారసుడు` టీమ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిన్న సునీల్ బాబుకి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హఠాహుఠిన కేరళలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చేర్పించారు.
కానీ, చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల దక్షిణాది సినీ పరిశ్రమ సంతాపం ప్రకటిస్తుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్గా సునీల్ బాబు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు ఆయన వంద సినిమాలకు పైగానే ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేశారు. గతేడాది రిలీజైన ‘సీతారామం’ సినిమాకు కూడా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇప్పుడు ఈయన వర్క్ చేసిన వారసుడు మరో వారంలో విడుదల కాబోతోంది. ఇంతలోనే ఆయన మరణించడం చిత్ర టీమ్ విషాదంలోకి నెట్టేసింది.