సడన్‌గా రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యక్షమైన తారక్.. అక్కడ ఏం చేస్తున్నాడు..?

ఎవరి సాయం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా నిలదొక్కుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటిదాకా తెలుగు సినీ ఇండస్ట్రీ వరకే పరిమితమైన అతని పాపులారిటీ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. తారక్‌కి హాలీవుడ్ హీరో రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇదంతా జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మహత్యమే అని చెప్పవచ్చు. కొమరం భీం పాత్రలో తారక్ అద్భుతంగా యాక్ట్ చేసి నటనలో తనని ఎవరు అధిగమించలేరని నిరూపించాడు. అయితే ఇప్పుడీ యంగ్ టైగర్ ఎక్కడున్నాడు? ఏ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడో తెలుసుకోవాలని అభిమానులు కుతూహల పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తారక్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యక్షమయ్యాడు.

రీసెంట్‌గా అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన జూ.ఎన్టీఆర్ ఇప్పుడు షూటింగ్ కూడా షురూ చేశాడు. అది మేరెక్కడో కాదు రామోజీ ఫిలిం సిటీ లోనే! అయితే తారక్ చేసింది సినిమా షూటింగ్ కాదు. ఈ ఎనర్జిటిక్ హీరో ఇవాళ ఉదయం ఒక యాడ్ షూట్ చేశాడు. రామోజీ ఫిలిం సిటీ లో ఒక యాడ్ షూటింగ్‌లో తారక్ పాల్గొంటున్నాడని తెలిసి.. కొందరు ఫ్యాన్స్ అక్కడికి క్యూ కట్టారు. తర్వాత అతనితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆపై ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’ గురించి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్‌ రాసిన కథనాలపై అతని ఆటోగ్రాఫ్‌లు రాయించుకున్నారు.

తారక్ 2023లో చేసిన ఫస్ట్ షూటింగ్ యాడ్ షూటింగ్‌యేనని తెలుస్తోంది. ఈ హీరో మరి కొద్ది రోజుల్లో డైరెక్టర్ కొరటాల శివతో కలిసి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ మూవీకి ఇంకా పూజా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రాకపోవచ్చు అని తెలుస్తోంది. కొరటాల శివ సినిమా 2024, ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. ఈ సినిమాను చాలా గొప్పగా రూపొందించడానికి ఇంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.