టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొద్ది రోజుల క్రితం `ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్` పేరిట ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ధోనీ.. తాజాగా ఆయన తొలి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. అదే `లెట్స్ గెట్ మ్యారీడ్`. అంటే పెళ్లి చేసుకుందాం అని అర్థం. తమిళంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది.
ఇందులో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నాడు. అలాగే `లవ్ టుడే` సినిమాతో బాగా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ ఇవానా ఈ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రమేశ్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, యోగి బాబు తదతరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
శుక్రవారం `లెట్స్ గెట్ మ్యారీడ్` సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను సైతం స్టార్ట్ చేయబోతున్నారు. కాగా, ఐపీఎల్లో ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ధోనీ ప్రాతినిథ్యం వహిస్తోన్నారు. ఆ అనుబంధంతోనే తొలి సినిమాను ఆయన తమిళంలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండియాలో వరుస చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.