ప్రముఖ ఓటీటీకి `శాకుంత‌లం`.. భారీ ధ‌ర ప‌లికిన డిజిట‌ల్‌ రైట్స్‌!?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పౌరాణిక చిత్రం `శాకుంత‌లం`. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్ర‌ణ‌య‌గాథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన‌ ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో స‌మంత టైటిల్ పాత్ర‌ను పోషించ‌గా.. దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా న‌టించాడు.

మోహ‌న్ బాబు, అన‌న్య నాగ‌ళ్ల‌, గౌత‌మి, సుబ్బ‌రాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ప్రేమ‌కుల కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ సైతం షురూ చేయ‌బోతున్నారు.

ఇక‌పోతే ఈ మూవీకి క‌ళ్లు చెదిరే రీతిలో బిజినెస్ జ‌రుగుతోంది. తాజాగా శాకుంత‌లం ఓటీటీ డీల్ సైతం క్లోజ్ అయింద‌ని.. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ భారీ ధ‌ర ప‌లికాయ‌ని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజార్ ప్రైమ్ వారు శాకుంత‌లం అన్ని భాష‌ల డిజిట‌ల్ రైట్స్ ను సొంతం చేసుకున్నార‌ట‌. ఇందుకు గానూ వారు రూ. 30 కోట్లు చెల్లించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.