న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గత ఏడాది జులైలో విడుదలైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు సొంతంగా హాస్పటల్ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎంబిబిఎస్ చదివినా.. నటి కావాలని ఆశించానని, అందుకు తన తల్లిదండ్రులు ఎప్పుడు అడ్డు చెప్పలేదని చెప్పుకొచ్చింది. అందం అనేది రూపంలో కాదు గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో నటిగా తన సినీ ప్రయాణం ప్రారంభమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని సాయి పల్లవి తెలిపింది.
ఇక మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి ఎప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని సాయి పల్లవి పేర్కొంది. దీంతో సాయి పల్లవి సినిమాలకు దూరం కాబోతోంది అన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఓ క్లారిటీ వచ్చేసింది. సరైన కథలు రాకపోవడం వల్లే సాయి పల్లవి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని ఆమె వ్యాఖ్యలు బట్టి స్పష్టంగా తేలింది.