నందమూరి ఫ్యామిలీ.. రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విషయంలో ఎలా ఉన్నా.. తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి టీడీపీ ఎవరిదనే ప్రశ్న వస్తే.. నందమూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నందమూరి ఫ్యామిలీ.. ఒకటి రెండు సీట్ల కోసం.. అభ్యర్థించే పరిస్థితి వచ్చిందని.. కుటుంబంలోనే ఒక టాక్తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం ఈ విషయం కుటుంబంలో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఇద్దరు కీలక వ్యక్తులు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకటి బయటకు కూడా లీక్ అయింది. అయితే.. మరొకరు మాత్రం వేరే మార్గంలో ప్రయత్నిస్తున్నారు. కానీ, వీరికి పార్టీ అదినేత నుంచి ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ లభించక పోవడం పట్ల నందమూరి అభిమానులు హర్టవుతున్నారు.
గుడివాడ నియోజకవర్గం నుంచి నందమూరి తారక రత్న పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై ఆయన పార్టీతో చర్చించాలని అనుకున్నారు. అయితే.. దీనిపై నేరుగా చంద్రబాబుతో కలవాలని ప్రయత్నించినా.. ఆయనకు ఇబ్బందులు వచ్చాయని.. ఈ క్రమంలోనే నారా లోకేష్తో భేటీ అయ్యారని అంటున్నారు. కానీ, ఇక్కడ కూడా గుడివాడ విషయంపై ఆలోచించి కబురు చేస్తామని చెప్పినట్టు పార్టీలో చర్చించుకుంటున్నారు.
మరోనేత.. నందమూరి సుహాసిని. హరికృష్ణ కుమార్తె. వచ్చే ఎ న్నికల్లో ఈమె కూడా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇక్కడ ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే.. ఆమె విషయాన్ని కూడా పార్టీ అధినేత పట్టించుకోవడం లేదని.. నందమూరి కుటుంబం భావిస్తోంది. నందమూరి కుటుంబానికి ఏదో అవమానం జరుగుతోందనే చర్చ.. అభిమానుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం. మరి దీనిపై చంద్రబాబు ఏమంటారో చూడాలి.