పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి`. ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్ ఎం.ఎం. రత్నం నిర్మించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విషయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న రీ రిలీజ్ అయింది. జనవరి 6వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాను 4కె ప్రింట్ తో విడుదల చేశారు. అయితే 22 ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కలెక్షన్స్ పరంగా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. అయితే రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. తొలి రోజు ఈ చిత్రం కళ్లు చెదిరే కవెక్షన్స్ ను రాబట్టింది.
డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.5 కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఏదీ మూడున్నర కోట్ల రూపాయిలు కలెక్ట్ చేయలేదు. మూడు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది. అది పవన్ కళ్యాణ్ నటించిన `జల్సా`. ఇప్పుడు ఈ మూవీని మించి ఖుషి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఖుషి రికార్డును సృష్టించింది.