అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం.. టాలీవుడ్ లో మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది.

సినిమా, స్పోర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో ప్రసిద్ధి పొందిన వ్యక్తులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బన్నీకి తాజాగా గోల్డెన్ వీసా అందింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వ‌యంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దుబాయ్ లోని ఓ అధికారితో కలిసి దిగిన పిక్ తో పాటు దుబాయ్ సిటీ వ్యూ పిక్ ను ఇన్‌స్టా ద్వారా పంచుకున్న బ‌న్నీ.. `మరోసారి అద్భుతమైన అనుభూతిని కలిగించిన దుబాయ్ కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్యూ` అంటూ పేర్కొన్నాడు.

దీంతో ఈయ‌న పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. బ‌న్నీకి గోల్డెన్ వీసా రావ‌డంతో అభిమానులు తెగ ఉప్పొంగిపోతున్నారు. ఎందుకంటే, ఇంతవ‌ర‌కు ఈ అరుదైన టాలీవుడ్ లో మ‌రే హీరోకు ద‌క్క‌లేదు. టాలీవుడ్ నుంచి తొలి గోల్డెన్ వీసా అందుకున్న హీరో బ‌న్నీనే కావ‌డం విశేషం. కాగా, నార్త్, సౌత్ లో ఇప్పుడు వ‌ర‌కు షారుఖ్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, కాజల్, ప్రణిత సుభాష్, మోహన్ లాల్, మమ్ముట్టి, అమలాపాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన వంటి వారు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు బ‌న్నీ కూడా చేరాడు.