వైసీపీ అధిష్టానానికి టెన్షన్ పెరుగుతోంది. బీపీ కూడా అదే రేంజ్లో పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ `వైనాట్ 175` నినాదం అందుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి కావాల్సింది.. నేతల మధ్య సఖ్యత. పోటీలేని.. టికెట్ల వ్యవహారం.. రెబల్స్ పెరగకుండా చూసుకోవడం.. ప్రజలకు నాయకులకు మధ్య ఫెవికాల్ బంధం బలోపేతం కావడం. అయితే.. ఈ కీలక సూత్రాలే ఇప్పుడు కనిపించడం లేదన్నది వైసీపీ అధిష్టానం ఆవిరులు కక్కుతోంది. ఎందుకంటే.. ఎటు చూసినా.. టికెట్ గోల వినిపిస్తోంది.
మేమంటే మేమేనంటూ నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరుకాదు ఇద్దరుకాదు.. ఎక్కువ మంది నాయకులు.. పోటీలో ఉన్నారు. ఒక సీటుకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనూ.. నాలుగు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. ఇతర జిల్లాల్లో పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. ఇదిలావుంటే..ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా నటులు వైసీపీ టికెట్లను ప్రకటించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే.. పోటీ చేస్తానని అలీ తాజాగా ప్రకటించారు.
ఇక, పోసాని కృష్ణమురళి కూడా ఇటీవల రహస్యంగా సలహాదారును కలిసి వెళ్లారనే టాక్ జోరుగా వినిపించింది. ఈయనకూడా టికెట్ అడుగుతున్నారు. మరోవైపు.. శ్రీరెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. అంతేకాదు.. తాను టీడీపీ కీలక మహిళా నేతపై పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే.. టికెట్లు ఆశించేవారి సంఖ్య పైకి కనిపిస్తున్నదానికన్నా.. ఎక్కువగానే ఉందని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. మరోవైపు.. కొందరు వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నారు. అయితే, వారి స్థానంలో మాత్రం నేతలు కనిపించడం లేదు.
ఇప్పుడు ఈ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య నేతలను సంబాళించడం.. దారిలో పెట్టడం కష్టంగా మారిందనేది పార్టీలో జరుగుతు న్న చర్చ. ఎవరిని కాదంటే.. ఏం జరుగుతుందో అనే భయం లేకపోయినా.. కీలకమైన ఎన్నికలు కావడంతో వర్గ పోరు లేకుండా చేసుకోవాలనేది పార్టీ అదిష్టానం ఆలోచన. నిజానికి 2019లో ఇంతకన్నా ఎక్కువగానే వర్గ పోరు కనిపించింది. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం కీలకమైన ఎన్నికలు కావడం.. పొత్తుల ఎత్తులు ఫలిస్తున్న నేపథ్యంలో ఈ టికెట్ గోల ఎటు దారితీస్తుందో అని ఒకింత బెంగ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.