లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడిచింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పండంటి మగ కవలలకు ఈ దంపతులు జన్మనిచ్చారు. ఇక వివాహం అనంతరం నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం కనెక్ట్.
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ స్వయంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 22న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నయన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురయింది.
దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? అంటూ నయనతారను ఓ విలేఖర్ ప్రశ్నించాడు. అందుకు నయన్ తనకు దెయ్యాలపై నమ్మకం లేదని.. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా భయంగా ఉంటుందని, అందుకే ఒంటరిగా ఉండలేనని చెప్పుకొచ్చింది. అలాగే దెయ్యాల కథా చిత్రాలకు పెద్ద అభిమానిని, ఇంతకుముందు దెయ్యాల ఇతివృత్తంతో కూడిన చిత్రాలను ఇష్టంగా చూసేదాన్ని అని నయన్ పేర్కొంది. మొత్తానికి దెయ్యాలు ఉంటాయని నమ్మకపోయినా.. దెయ్యాలంటే మాత్రం భయమంటోంది లేడీ సూపర్ స్టార్.