పవన్‌కు 45 సీట్లు..కొడాలి డిమాండ్?  

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు..ఎన్నికల ముందు పొత్తు గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీని ఢీకొట్టాలంటే రెండు పార్టీలు తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకే ప్లస్. అందుకే రెండు పార్టీలు కలవడం దాదాపు ఖాయమైంది. అయితే అధికారికంగా సీట్ల పంపకాల గురించి ఎలాంటి చర్చ లేదు గాని..అనధికారికంగా సీట్ల పంపకాల గురించి చర్చలు నడుస్తున్నాయి.

టీడీపీ 20-25 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది..జనసేన ఏమో 40-45 సీట్లు వరకు అడుగుతుందని కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా మీడియాలో జరిగే చర్చ తప్ప..అధికారికంగా సీట్ల పంపకాలపై ఎలాంటి నిర్ణయం రాలేదు. అయితే టీడీపీ-జనసేన సీట్ల పంపకాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్‌పై రెక్కీ జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ప్రాణాలకు హాని ఉందని చెప్పి జనసేన శ్రేణులు అంటున్నాయి. ఇదంతా వైసీపీనే చేయిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ..పవన్‌ని ఏదైనా చేయాలనుకునేది చంద్రబాబు మాత్రమే అని, ఆయనే రెక్కీ చేయించి ఉంటారని, పవన్‌ని ముంచాలన్న, తేల్చాలన్న చంద్రబాబు చేయాలని, పవన్ 45 సీట్లు ఇవ్వాలని కోరితే..బాబు దానికి ఒప్పుకోకుండా, పవన్‌పై రెక్కీ చేయిస్తున్నారని కొడాలి విమర్శించారు. అంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలో కొడాలి నాని చెప్పేస్తున్నారు. టీడీపీ-జనసేనల మధ్య విభేదాలు ఉన్నాయనే కోణంలో కొడాలి మాట్లాడుతున్నారు.

ఎందుకంటే టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదనే వైసీపీ నేతలు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే పొత్తు లేకుండా చేయాలని చెప్పి..పవన్‌కు దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు-పవన్ కలవడంతో వైసీపీ నేతల ఆశలు నెరవేరలేదు. పొత్తు వల్ల తమకు ఇబ్బంది అని తెలిసి..ఎలాగోలా పొత్తు లేకుండా చేయాలనే టార్గెట్‌తో వెళుతున్నారు. కొడాలి కూడా అదే విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.