కాకినాడ రూరల్‌లో ‘ఇన్‌చార్జ్’ రగడ..టీడీపీలో విభేదాలు..!

రాష్ట్రంలో టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ ఒకటి. గత ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో పెద్ద రచ్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పిల్లి అనంతలక్ష్మీ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక పార్టీలో ప్రాధాన్యత లేదని పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మీ దంపతులు పార్టీకి దూరమయ్యారు. దీంతో కాకినాడ రూరల్‌లో కొందరు నేతలు రేసులోకి వచ్చారు..వారు ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు.

ఇదే క్రమంలో కొంతకాలం తర్వాత పిల్లి దంపతులు మళ్ళీ పార్టీలో యాక్టివ్ ఆయ్యారు. కాకినాడ రూరల్ మాదే అంటూ ప్రచారం చేస్తున్నారు. అటు పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసుదాసులు సైతం సీటు ఆశిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టి‌డి‌పిలో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టి‌డి‌పి అధిష్టానం..ఓ కమిటీని నియమించి అక్కడ పార్టీ పరిస్తితిని సమీక్షించడానికి పంపారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు..కాకినాడ వెళ్ళి కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఇన్‌చార్జిని ఇవ్వండి!

దీనికి టిక్కెట్‌ ఆశిస్తున్న పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబు హాజరు కావలసి ఉన్నా డుమ్మా కొట్టారు. సత్తిబాబు ఎందుకు రాలేదు అనేది క్లారిటీ లేదు. ఈ విషయంపై అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని పరిశీలకులు నిర్ణయించుకున్నారు. అలాగే త్వరగా ఇంచార్జ్‌ని నియమించాలని అక్కడ కార్యకర్తలు పట్టుబట్టారు.

దీంతో ప్రతి ఒక్కరూ ఇంచార్జ్ అని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ సభ్యత్వాలు, బాదుడే బాదుడు, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇంచార్జ్ నియామకం చంద్రబాబు చూసుకుంటారని, ఇక్కడ ఉన్న పరిస్తితులని తాము చంద్రబాబుకు వివరిస్తామని పరిశీలకులు చెప్పుకొచ్చారు. అయితే త్వరగా ఇంచార్జ్ పదవి నియమించకపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్తితి ఘోరంగా తయ్యారయ్యేలా ఉంది. కాకపోతే ఏ గోల లేకుండా పొత్తు ఉంటే ఈ సీటుని జనసేనకు ఇచ్చేస్తారనే ప్రచారం కూడా ఉంది. మరి కాకినాడ రూరల్‌లో ఏం జరుగుతుందో చూడాలి.