పవన్ చేయబోతున్న మరో రీమేక్… వద్దంటూ వారిస్తున్న అభిమానులు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపకి అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఒక స్టేజి మీద హరీష్ శంకర్ అన్నట్టు… ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా.. పైనుండి కిందకు కరెంటు పాస్ అవుతుంది. నిర్మాత బండ్ల గణేష్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం.. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే, చచ్చేదాకా వదలదు. అవును, అతనికి అభిమానులు వుండరు, మేనిక్స్ వుంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పూర్తి బిజీ కావడంతో సినిమాలపై దృష్టి కాస్త తగ్గించారు.

ఈ క్రమంలో పెద్దగా సమయం లేనందున రీమిక్స్ బాట పడుతున్నారు. ఇపుడు అదే విషయం పవర్ స్టార్ అభిమానులకు కాస్త నిరుత్సాహాన్ని ఇస్తోంది. ఆయన తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తదుపరి ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే హరీష్ శంకర్ తో అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్టు మాత్రం ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుందో స్పష్టత లేదు. కాగా ఇపుడు మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమా మరేమిటో కాదు. త‌మిళ్ లో విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన థేరీ చిత్రం. ఈ రీమేక్ చేయబోతున్నట్లు తాజాగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఈ మూవీని ఇప్పటికే తెలుగులో `పోలీసోడు` పేరుతో దిల్ రాజు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన సంగతి విదితమే. అయితే ఇదే చిత్రాన్ని త్వరలో మళ్ళీ రీమేక్ చేయడంతో అభిమానులు వాపోతున్నారు. కాగా ఈ రీమేక్ కి ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్టు వినికిడి. గతంలో పవన్ ఓ తమిళ సినిమాని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసినదే. ఈ క్రమంలో ఈ రీమేక్ విషయంలో అభిమానులు మండిపడుతున్నారు.