గిద్దలూరులో ‘ఫ్యాన్స్’ కుమ్ములాట!

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అన్నా రాంబాబు రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే…జగన్ తర్వాత ఈయనకే భారీ మెజారిటీ వచ్చింది..పులివెందులలో జగన్ 90 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…గిద్దలూరులో రాంబాబు 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు…మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు..అంతే భారీ స్థాయిలో ప్రజలకు అండగా ఉంటున్నారా? అంటే పెద్దగా ఉండటమే లేదనే చెప్పొచ్చు.

ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గాని…ఈయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఏదో యథావిధిగా వచ్చే సంక్షేమ పథకాలే ప్లస్ తప్ప…ఇక్కడ రాంబాబుకు చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ ఏమి లేవని విశ్లేషకులు అంటున్నారు. ఇంత భారీ మెజారిటీతో గెలిచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేగా రాంబాబు ముందు వరుసలో ఉంటారని చెబుతున్నారు.

 

అయితే ప్రజల మద్ధతు పెంచుకోవడం పక్కన పెడితే…కనీసం సొంత పార్టీ శ్రేణుల మద్ధతు కూడా దక్కించుకోవడంలో రాంబాబు విఫలమవుతున్నారని తెలుస్తోంది. సొంత పార్టీ వాళ్లే రాంబాబు పై తిరుగుబాటు జెండా ఎగరవేశారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈయన టీడీపీ నుంచి రావడం…అలాగే టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. పదవులు గాని, కాంట్రాక్టులు గాని టీడీపీ నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారట

అందుకే దీనిపై తేల్చేయాలని నియోజకవర్గంలో మొదట నుంచి వైసీపీ కార్యకర్తలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారట. బాలినేని సమక్షంలోనే రాంబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య రచ్చ నడిచిందట. ఇక దేన్ని పరిష్కరించలేక బాలినేని…నియోజకవర్గానికి వచ్చి మండలాల వారీగా పరిస్తితి చక్కదిద్దే కార్యక్రమం మొదలుపెట్టారట. అయితే బాలినేని ఎంత చేసిన రాంబాబుపై వ్యతిరేక వర్గం గుర్రుగానే ఉంది. నెక్స్ట్ గాని రాంబాబుకు సీటు వస్తే…సొంత వాళ్లే ఓడించడానికి పనిచేసేలా ఉన్నారు. మొత్తానికి గిద్దలూరులో వైసీపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరేలా ఉన్నాయి.