ఫెయిల్యూర్స్‌కు కేరాఫ్‌గా మారిన మెగా ఫ్యామిలీ!

మెగా ఫ్యామిలీ.. ఓ అరడజను హీరోలు ఉన్నా ఎవరికి వారే తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇలాంటి ఫ్యామిలీ గతకొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. కానీ ఇప్పుడు అదంతా గతం అంటున్నారు సినీ క్రిటిక్స్. మెగా ఫ్యామిలీలో ఒక్క బన్నీ తప్ప మిగతా ఎవరూ కూడా కనీసం హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

ముందుగా మెగాస్టార్ చిరంజీవితో మొదలుపెడితే, ఖైదీ నెంబర్ 150 ఆయన కమ్ బ్యాక్ మూవీగా రావడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైరా నరసింహారెడ్డి మాత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆచార్య సినిమా తొలిరోజే ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకోవడంతో ఈ సినిమా ఎంతటి డిజాస్టర్‌గా మిగులుతుందో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు రామ్ చరణ్ కూడా లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని మంచి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడో లేదో, ఆచార్యతో మళ్లీ ఫ్లాప్ మిగిలించుకున్నాడు. అటు సాయి ధరమ్ తేజ్ కూడా వరుసగా యావరేజ్ మూవీలతో నెట్టుకొస్తున్నాడు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అయితే సక్సెస్ చూసి చాలా రోజులయ్యింది. వరుసగా ఔట్ డేటెడ్ కంటెంట్‌లతో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడు. ఇక ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, రెండో సినిమా కొండపొలంతో డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. ఇలా మెగా హీరోలందరూ కూడా ప్రస్తుతం ఫెయిల్యూర్ సినిమాలతో ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంటే, అసలు మెగా ఫ్యామిలీకి ఎమైందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.