ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. ఇక జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ? ఉండబోతున్నారు ? అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్, గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ పేర్లు మంత్రి వర్గం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి కుల సమీకరణలను బట్టి చూస్తే కూడా వీరికి మంత్రి పదవులు దక్కడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ వర్గానికి చెందిన మహిళ. ఈమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి. ఈయన రెడ్డి సామాజికవర్గ నేత. రెడ్డి + ఎస్సీ ఈక్వేషన్లో ఆమెకు మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. పైగా 2014 నుంచి కూడా ఆమె పార్టీలో ఉన్నారు. 2014లో ఓడినా ఐదేళ్ల పాటు కష్టపడి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు.
ఇక అదే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ విషయానికి వస్తే …ఆమె బీసీ, భర్త రెడ్డి సామాజిక వర్గం. ఇటు బీసీకి మంత్రి పదవి ఇచ్చానని జగన్ చెప్పుకుంటారు. కానీ పెత్తనం అంతా రెడ్డి నేతదే అవుతుంది. అటు పద్మావతి విషయంలోనూ అదే జరగవచ్చు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా బీసీనే. ఆమె భర్తది కాపు సామాజిక వర్గం.
రజనీకి మంత్రి పదవి ఇస్తే ఇటు బీసీ, అటు కాపు ఓట్లను కొల్లగొట్టవచ్చన్నదే జగన్ ప్లాన్ కావచ్చు. ఆమె ఉన్నత విద్యావంతురాలు సజ్జల ద్వారా బలమైన లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఆమెకు ఓ అవరోధం కూడా ఉంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. సీటు త్యాగం చేసిన ఆయనకు కాదని రజనీకి మంత్రి పదవి ఎలా ? ఇస్తారన్న సందేహాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ ముగ్గరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా రెండు కులాలను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది.