వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారనే అంటున్నారు.
నియోజకవర్గంలో ప్రతి చిన్న సమస్య పైనా ఆయన దృష్టి పెట్టారు. పేదలకు ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని చెరువ చేస్తున్నారు. నిజానికి నియోజకవర్గ ఎమ్మెల్యే ఈయనేనా అని అనిపించే స్థాయిలో దేవినేని అవినాష్ దూకుడుగా వ్యవహరిస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్డు విస్తరణ కారణంగా గతంలో స్థలాలు కోల్పోయిన వారు, అదేవిధంగా ఇప్పటికీ రోడ్ల విస్తరణ లేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిగా దేవినేని అవినాష్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న జగనన్న ఇళ్లు కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు ఎంతో కృషి చేశారు. తాగునీరు లేనటువంటి గుణదల కొండ ప్రాంతాల్లో పైపు లైన్లను వేయించడం.. అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించడం.. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇప్పించడం.. వంటివి ఆయన చేపట్టారు. ఇలా ఒకవైపు ప్రజలకు చేరువ అవుతూ మరోవైపు పార్టీ కార్యక్రమాలను దేవినేని అవినాష్ నిర్వహిస్తున్నారు. ఇలా ఆయన చరిత్ర సృష్టిస్తున్నారనే చెప్పాలి. దీంతో దేవినేని అవినాష్ సమర్థవంతమైన నాయకులు అంటూ వైసిపి నాయకులే మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.