యావత్ దేశం టాలీవుడ్ గురించే చర్చ.. కళ్ళన్నీ ఇక్కడే?

2021లో కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఇక విడుదలైన సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులు అందరికి కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంజాయ్ మెంట్ అందించాయి. కామెడీ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ల వరకు అన్ని 2021 సంవత్సరం లో ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2022 పైనే ఉంది. ఇక 2022 సంవత్సరమంతా థియేటర్లో పెద్ద సినిమాల జాతర జరగబోతుంది అని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం దాదాపు స్టార్ హీరోల సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉండటం గమనార్హం.

 

ఇలా 2022లో విడుదల కాబోయే సినిమాలలో అందరు ఎదురు చూస్తున్నది త్రిబుల్ ఆర్ సినిమా కోసం. అదుగో వస్తుంది ఇదిగో వస్తుంది అని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప.. ఈ సినిమా విడుదలైంది లేదు. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022 సంవత్సరంలో విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది

భారీ అంచనాల మధ్య తెరకెక్కిన మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. అన్నీ అనుకూలిస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. అంతేకాదండోయ్ ఆది పురుష్, సలార్ లాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా సమ్మర్లో సోలార్ ఆగస్టు తర్వాత ఆది పురుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ కూడా ఏడాది రాబోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.ఇక ఈ సినిమాపై అటు సౌత్లో మరోవైపు నార్త్ లో కూడా అంచనాలు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి.

 

2022 లో విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి.పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ డ్రామా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

2021 ఎండింగ్ లో విడుదలై సెన్సేషన్ సృష్టించిన పుష్పా సినిమా భారీ వసూళ్లు కూడా రాబట్టింది ఇక ఈ సినిమాకు కొనసాగింపు పుష్ప ది రూల్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. సినిమా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమా గా తెరకెక్కుతున్న శాకుంతలం కూడా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ఇక ఇలా భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో అందరికీ చూపు తెలుగుచిత్ర పరిశ్రమ పైనే ఉంది అని చెప్పాలి.