జనంలో కాదు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌

ఆర్‌కే అలియాస్‌ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. అదే ఊపులోనే 2019లో కూడా గెలిచాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్‌ను 5337 ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించాడు.

అయితే ఆళ్ల రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనం గురించి మరచిపోయాడు. ఎక్కడ మా ఎమ్మెల్యే అని మంగళగిరి వాసులు వెతుకుతున్నారు. ఆయన కనిపిస్తోంది కేవలం సోషల్‌ మీడియాలోనే.. జనంలో కాదు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ నియోజకవర్గంమొత్తం కవర్‌ చేస్తున్నాడు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ఏవీ ఆయన పట్టించుకోవడం లేదని జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జనం ఎక్కువగా సంతోషపడ్డారు. ఈసారి మా బతుకులు మారుతాయి.. ఆర్‌కే గెలవడం మా అదృష్టం.. అందులోనూ వైసీపీ అధికారంలో ఉంది.. నియోజకవర్గం మొత్తం అభివృద్ధి దిశలో పయనిస్తుందని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సోషల్‌ మీడియాలో తప్ప ఆయనను నేరుగా చూద్దామంటే కనిపించడు. అమరావతికి సమీపంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యేనే పట్టించుకోకపోతే ఇక మమ్మల్నెవరు పట్టించుకుంటారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆళ్ల పరిస్థితి పార్టీలో ఏమవుతుందో అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.