బీజేపీతో తేడా కొట్టింది.. అందుకే ఉక్కు దీక్ష

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.. సినిమా పరంగా కాదు.. రాజకీయపరంగా.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు నడుపుతూ ముందుకుపోతున్న పొలిటికల్ పవర్ స్టార్ ఉన్నట్టుండి ఉక్కు దీక్ష ప్రకటించాడు. విశాఖలోని వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. వారికి జనసేనాని మద్దతుగా నిలిచాడు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఈయనకు బీజేపీతో వ్యవహారం ఎక్కడో చెడింది.. అందుకే కమలం పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమం ప్రారంభించాడని అనుకుంటున్నారు. పార్టీ ప్రారంభించిన మొదట్లో చంద్రబాబు, మోదీకి బాగా దగ్గరగా ఉన్న పవన్ ఎందుకో ఇద్దరికీ దూరమైనట్లు కనిపిస్తున్నాడు. ఒక పార్టీపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా అంతర్గతంగా మాత్రం భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సారి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందుకే పార్టీలో కార్యకర్తల్లో జోష్ నింపడానికి పవర్ స్టార్ ప్రజల్లోకి వస్తున్నాడు.

మేము సైతం.. అని చెప్పడానికేనా ఈ నిరసన

వీఎస్పీని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఈనెల 12న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఈ సమస్యపై జగన్ పార్టీ కూడా స్పందించడం లేదని, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లాలని సూచించినా పట్టించుకోవడం లేదని పవర్ స్టార్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు కూడా. ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే తమ పార్టీ ఈ సమస్యను జనసేన తన భుజంపై మోసి ప్రజా సమస్యల పరిష్కారంలో మేము సైతం.. అన్నట్లు చూపడానికే ఉండవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు.