టాలీవుడ్ కు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు..కారణమిదే..!

ఒకప్పుడు సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్. అక్కడ సినిమాలు చేస్తే మంచి గుర్తింపు సాధించడంతో పాటు డబ్బు కూడా వస్తుందని.. అలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాల మార్కెట్ పెరగడం, భారీ చిత్రాల నిర్మాణమే. టాలీవుడ్ లోని స్టార్ హీరోల క్రేజ్ కూడా ఇందుకు ఒక కారణం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, అలియాభట్, కియారా అద్వానీ, కృతి సనన్, అనన్య, జాక్వలిన్ ఫెర్నాండెజ్ వంటి వారు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కృతి సనన్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.

రామ్ చరణ్, శంకర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఈమె ఇదివరకే తెలుగులో రెండు సినిమాలు చేసింది. యువ హీరో విజయ్ దేవరకొండ తెలుగు, హిందీ భాషల్లో చేస్తున్న లైగర్ లో అనన్య పాండే హీరోయిన్ గా చేస్తుండగా, పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఒక కీలక పాత్రలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. అలాగే కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు అయిన జాన్వీ కపూర్ లేదా అలియా భట్ లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవాలని ఆ మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు అందరూ తెలుగులో సినిమాలు చేస్తున్నారు.