భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా ఈ మూవీ రీమేక్ అవుతోంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు.

కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ గ్లింప్స్ తో పాటు మూడు పాటలు విడుదలై అభిమానులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 7 నిమిషాలకు ‘అడవి తల్లి మాట’ అనే ఈ మూవీలోని నాలుగో పాటను విడుదల చేయనున్నట్లు ఈ మూవీమేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇవాళ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ఈ పాటను విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా యూనిట్ కారణం చెప్పకపోయినా దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ఈ పాట విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.