ఆ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఐశ్వర్య‌రాయ్‌..ఈడీ నోటీసులు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వ‌ర్య‌రాయ్ బచ్చన్‌కు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచ‌లనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వ‌ర్య‌రాయ్ అడ్డంగా ఇరుక్కుంది.

ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయ‌గా.. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసుల‌ను జారీ చేసింది. అయితే విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయాన్ని ఐశ్వర్య కోరగా.. అందుకు ఈడీ ఒకే చెప్పింది. దీంతో ఇప్పుడీ విష‌యం బాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.

కాగా, దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పన్ను ఎగవేత కోసం ఎలాంటి అవకతవకలకు పాల్పడింది, మనీ లాండరింగ్ వ్యవహారాలను బట్టబయలు చేసిందే పనామా పేపర్స్ లీక్. మన దేశంలోనూ పనామా లీక్స్ ప్రకంపనలు రేపగా… ఈడీ ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి ఏకంగా 500 మందికి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.