ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో.. రెండే రెండు సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్.
అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానిది కూడా కీలక పాత్ర. ఈసినిమాకు మిక్కీ జె మేయర్ మంచి పాటలు అందించడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేసాడు. దీంతో నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా అయిన ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని మిక్కీ జె మేయర్ కు ఇచ్చాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే తాజాగా మిక్కీ జె మేయర్ ని ప్రాజెక్టు కే మూవీ నుంచి తప్పించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ స్థానంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మిక్కీ జె మేయర్ ఇంతవరకూ పెద్ద సినిమాలకు పని చేయలేదు. ప్రేమ కథ, కుటుంబ కథా చిత్రాలకు మాత్రమే మ్యూజిక్ అందించాడు. ఆయన పాటలన్నీ మెలోడీలే.
మరోవైపు సంతోష్ నారాయణన్ వరుస విజయాలు అందుకోవడమే కాకుండా రజనీకాంత్ కబాలి, కాలా వంటి భారీ చిత్రాలకు సంగీతం అందించిన అనుభవం ఉంది.దీంతో మిక్కీ జె మేయర్ కంటే సంతోష్ నారాయణన్ బెస్ట్ ఆప్షన్ అవుతాడని ప్రాజెక్టు కే మేకర్స్ భావిస్తున్నారట. అయితే మిక్కీ జె మేయర్ తొలగింపు పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.