ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్లో రిటైర్మెంట్ పై ‘తల’ క్లారిటీ..!

మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఐపీఎల్ లో ధోని ఆఖరి ఆట ఆడేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గొప్ప ప్రదర్శన చేయలేదు. ధోని కూడా వ్యక్తిగతంగా సరిగ్గా ఆడలేదు. దీంతో గత ఏడాదే ధోని ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ధోనీ ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఆడటమే కాకుండా తన జట్టుకు టైటిల్ అందించాడు.

కాగా ఐపీఎల్లో ఈ ఏడాది అన్ని జట్లు తమ ఆటగాళ్లను వదులుకొని తిరిగి వేలంపాటలో తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. దీంతో ఒక్కో జట్టు తమ టీం లో నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లను వదిలేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోని పలుసార్లు.. తనను రిటైన్ చేసుకోవద్దని జట్టు యాజమన్యాన్ని కోరాడు. దీంతో ధోనీ ఇక ఐపీఎల్ ఆడడని వార్తలు వచ్చాయి.

కాగా నిన్న చెన్నైలో ఐపీఎల్ టైటిల్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోనీ ఐపీఎల్ లో తన రిటైర్మెంట్ పై మాట్లాడుతూ ‘ తన చివరి టీ20ని చెన్నైలో అభిమానుల మధ్య ఆడాలని కోరుకుంటున్నానని.. అయితే అది వచ్చే ఏడాదా లేదా మరో ఐదేళ్ల తర్వాత అన్నది ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి ధోనీ మరి కొన్నేళ్లు ఐపీఎల్లో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ధోని కొనసాగుతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.