గత కొంత కాలం నుంచీ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతుండగా.. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచి కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట.
నటనపై మక్కువతో చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగిన ఆయన..1995లో వచ్చిన `ఊరికి మొనగాడు` చిత్రంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దాదాపు 62 సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రాజబాబు.. పలు సీరియల్స్నూ నటించి మెప్పించారు.