తారక్ షో కోసం తంటాలు పడుతున్న నిర్వాహకులు

తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో టీఆర్పీల తుక్కురేగ్గొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ సీజన్ 1లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకు తెలిసిందే. ఆ షో విజయంలో కీలక పాత్ర పోషించాడు తారక్. అయితే చాలా కాలం తరువాత తారక్ మళ్లీ బుల్లితెరపై తన సత్తా చాటేందుకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ప్రోగ్రాంతో మనముందుకు వచ్చాడు. కానీ ఈసారి తారక్ అనుకున్న స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడం లేదా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రస్తుతం జెమిని టీవీలో ప్రసారం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ షోను ఆగస్టు 22న ప్రారంభించారు. అయితే ఈ షో టెలికాస్ట్‌లో కర్టెన్ రైజర్‌కు మాత్రమే అదిరిపోయే టీఆర్పీ దక్కినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ షోకు అనుకున్న స్థాయిలో టీఆర్పీ రావడం లేదని నిర్వాహకులు నిరుత్సాహపడుతున్నారట. అందుకే ఈ షోకు పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చే పనిలో పడ్డారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివలతో ఓ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.

అయితే ఇటీవల బిగ్‌బాస్ మొదటి ఎపిసోడ్ సాధించిన టీఆర్పీ రేటింగ్స్ ఎవరు మీలో కోటీశ్వరులు కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు ఈ షో నిర్వాహకులు మరిన్ని హంగులు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా తారక్ చేస్తున్న షోకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.